ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం
పలువురిని అరెస్టు చేసిన రామన్నపేట పోలీసులు
మార్కెట్లలో నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నాకు బయలుదేరిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగంలను పోలీసులు రామన్నపేటలో అరెస్ట్ చేశారు. రైతు సంఘాల పిలుపుమేరకు పెద్ద తుమ్మలగూడెం రైతులతో కలిసి భువనగిరి బయలుదేరుతుండగా, పోలీసులు ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి మరీ తమను బలవంతంగా పీఎస్కు తరలించారని, సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారని వారు మండిపడ్డారు. రౌడీలను, గూండాలను అరెస్ట్ చేసినట్లుగా రైతుల కోసం పోరాడే వారిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రామన్నపేట మార్కెట్లలో ధాన్యం పోసి రెండు నెలలవుతున్నా కొనేనాథుడు లేక, వర్షాలకు తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే, ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను పక్కనబెట్టి రైతులను అరిగోస పెడుతున్నారని ధ్వజమెత్తారు. మార్కెట్లలోని ధాన్యాన్ని వెంటనే ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి అని. లారీలు, హమాలీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలి అని తెలిపారు క్వింటాలుకు ఐదారు కిలోలు కట్ చేస్తున్న రైస్ మిల్లులను సీజ్ చేయాలి. అని కాంటా వేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు..