ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం.. 15 విమానాల దారి మళ్లింపు
ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం.. 15 విమానాల దారి మళ్లింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 15 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు.
దారి మళ్లించిన విమానాల్లో 12 విమానాలను జైపూర్కు, రెండు విమానాలను చండీగఢ్కు, ఒక విమానాన్ని లక్నోకు పంపించారు. వర్షం, తక్కువ దృశ్యమానత కారణంగా టేకాఫ్, ల్యాండింగ్లపై ప్రభావం పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
భారీ వర్షాలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.
విమాన ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను ముందుగా పరిశీలించుకుని విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి.