ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై దాడి
దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి దారుణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 12 రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బాధిత మహిళ సరస్వతీ విహార్ బస్టాండ్ వద్ద వేచి ఉండగా, అక్కడికి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులోకి డ్రైవర్, కండక్టర్ బలవంతంగా లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం కదులుతున్న బస్సులోనే ఆమెపై దాడి చేసి, రాత్రంతా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వివరాలు, నిఘా దృశ్యాల ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన నిర్భయ ఘటనను తలపించేలా ఈ సంఘటన ఉండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.