MPL పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని తహసిల్దార్కు వినతి
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వట్టిమర్తి శివారులో ఉన్న ఎం.పి.ఎల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న భారీ కాలుష్యం, నల్లని పొగ, బూడిద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం చిట్యాల తహసీల్దార్ విజయ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్య ప్రభావంతో చిట్యాల మున్సిపాలిటీతో పాటు వట్టిమర్తి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి పూర్తిగా కలుషితమవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమ యాజమాన్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో మున్సిపల్ సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మలగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, 9వ వార్డు బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆగు అశోక్ యాదవ్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.