ఎస్సైని లంచ్ టైం వరకు కోర్టులో నిలబెట్టిన హైకోర్టు
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించబోమంటూ మధురానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఎస్సై ఉస్మాన్ (75)ను లోదుస్తుల్లోనే ఇంటి నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటనపై కోర్టు తీవ్రంగా స్పందించింది.
విచారణ సందర్భంగా సంబంధిత ఎస్సై కోర్టులో హాజరుకాగా, మధ్యాహ్న భోజన విరామం వరకు కోర్టు హాలులోనే నిలబడి ఉండాలని జస్టిస్ టీ. మాధవీదేవి ఆదేశించారు. పోలీసు అధికారుల వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, "పోలీస్ అయినంత మాత్రాన చట్టానికి అతీతంగా వ్యవహరించే అధికారం ఎవరికీ లేదు" అని స్పష్టం చేసింది.
పిటిషనర్ ఉస్మాన్ తన ఇంటిలో మే 18న ఉండగా పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, లోదుస్తుల్లోనే బయటకు ఈడ్చుకెళ్లారని, తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు.
ఈ అంశంపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తూ, ప్రభుత్వ న్యాయవాదిని నివేదికను కోర్టుకు అందజేయాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
ఈ ఘటనపై న్యాయవర్గాల్లో, పోలీసు వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థే పౌరుల హక్కులను ఉల్లంఘిస్తే న్యాయస్థానాలు ఎంత కఠినంగా స్పందిస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.