నిధుల వినియోగంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి --మారుపాక అనిల్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో దళితులు, అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం రోజున దళిత హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా సమితి సమావేశం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో కాశపాక దయాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డిహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ, ఆ నిధులు నిజంగా దళితులు,ఆదివాసుల అభివృద్ధికే ఖర్చవుతున్నాయా లేదా అన్న విషయంపై స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.సబ్ ప్లాన్ చట్టం ప్రకారం దళితులు, ఆదివాసుల జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించి,ఆ వర్గాల విద్య, ఉపాధి,ఆరోగ్యం,గృహాలు,భూమి పంపిణీ వంటి రంగాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. కానీ అనేక శాఖలు ఈ నిధులను ఇతర పథకాల కింద చూపించడం లేదా ఖర్చు చేయకుండా నిల్వ చేయడం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.అయినప్పటికీ ఈ నిధుల వినియోగంలో ప్రభుత్వం పారదర్శకత పాటించకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన మొత్తం నిధులు, ఖర్చు చేసిన మొత్తం,మిగిలిన నిధులు మరియు అవి ఏ పథకాలపై ఖర్చు అయ్యాయన్న వివరాలతో కూడిన పూర్తి స్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.అలాగే సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లింపులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దళితులు మరియు ఆదివాసుల అభివృద్ధికి ఈ నిధులు పూర్తిగా వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. లేదంటే దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో డి హెచ్ పిఎస్ జిల్లా కార్యదర్శి సలిగంజి వీరాస్వామి,జిల్లా నాయకులు ఇంజ హేమలత, భాగ్య,కొమ్ము బాల నర్సింహా , లింగస్వామి,మూల పోచయ్య , చెడె సుందర్,శాంతి కుమార్, రమేష్,స్వామి,మనోహరమ్మా, తదితరులు పాల్గొన్నారు.