గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు
తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు సమయానికి వేతనాలు అందుతున్నట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా జీతాలు అందాలని ఆయన స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని హెచ్చరించారు.
అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక స్వతంత్రతకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు వెల్లడించారు. గత ప్రభుత్వం తొలగించిన గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ నిబంధనలను పునరుద్ధరించాలని సూచించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3) ప్రకారం గ్రామ పంచాయతీల స్వంత ఆదాయం (Own Source Revenue) ట్రెజరీ ఖాతాల్లో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చట్ట సవరణలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
పెన్షన్ పంపిణీ విధానంపై కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న పెన్షన్లను ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేయాలని సూచించారు. పెన్షన్లు నిజమైన అర్హులకు మాత్రమే అందేలా ఓటర్ ఐడీ, ఆధార్, SEEEPC సర్వే డేటా ఆధారంగా క్రమబద్ధీకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త పెన్షన్ల మంజూరులో అర్హులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి మరియు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.