గుండు చేయించుకుంటే డబ్బులు అంటూ మోసం! ముగ్గురు మహిళలను బురిడీ కొట్టించిన ఆకతాయిలు
సేలం జిల్లాలో విచిత్ర ఘటన.. ఫోన్ కాల్ నమ్మి గుండు చేయించుకున్న బాధితులు
తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి ప్రాంతంలో అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు విచిత్రమైన మోసానికి పాల్పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన ఓ అజ్ఞాత వ్యక్తి, త్వరలో కరోనా తరహా కొత్త వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని మహిళలను భయపెట్టాడు.
విదేశాల్లో ఆ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేస్తోందని నమ్మించాడు. ప్రభుత్వం ప్రత్యేక పథకం కింద గుండు చేయించుకున్న మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం, కళాశాల విద్యార్థినులకు రూ.45 వేలతో పాటు ఉచిత ల్యాప్టాప్, పురుషులకు రూ.6 వేల నగదు అందిస్తామని చెప్పాడు. ఇప్పటికే జాబితాలో మీ పేరు ఉందంటూ ఓ మహిళను నమ్మించాడు.
ఆ మహిళ ఈ విషయాన్ని గ్రామంలోని ఇతర మహిళలకు చెప్పడంతో ముగ్గురు మహిళలు నిజమేనని భావించి గుండు చేయించుకున్నారు. అనంతరం చెప్పిన నంబర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను గుడ్డిగా నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలపై సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.