న్యాయం కోసం కలెక్టరేట్కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం
గుంటూరు కలెక్టరేట్లో యువతి ఆత్మహత్యాయత్నం
గుంటూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 'నాని' అనే యువతి తన కుటుంబ సభ్యుల వేధింపులను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బాధిత యువతి ఆరోపణల ప్రకారం, తన తండ్రి, బాబాయ్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు తనను, తన తల్లిని వేధిస్తున్నారని తెలిపింది. తన తండ్రికి రెండో వివాహం జరిపించి, తన తల్లి వద్ద నుంచి 15 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదును తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయంపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో కలెక్టరేట్లోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఘటనను గమనించిన అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి చేసిన ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.