ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంఈవో మాసగిరి శ్రీనివాస్
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంఈవో మాసగిరి శ్రీనివాస్
చాట్రాయి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మండల విద్యాశాఖ అధికారి–1 మాసగిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
గురువారం ఆరుగొలనుపేట ఎం.పి.యు.పి. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పాఠశాల రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్ డే సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై తమ పిల్లల విద్యా ప్రగతిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'అమ్మకు వందనం' పథకం ద్వారా నగదు తల్లుల ఖాతాల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారధికి మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు చంద్రు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.