ఘనంగా ముగిసిన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం
నల్లగొండ జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో వెల్మకన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం అట్టహాసంగా ముగిసింది. మే 24 నుండి జూన్ 09 వరకు జరిగిన ఈ క్రీడా ప్రాంగణ ముగింపు కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.బి. రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ గారు మంజూరు చేసిన సర్టిఫికెట్లను, ప్రధానోపాధ్యాయులు ఆర్.బి. రాములు క్రీడాకారులకు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ ఉచిత శిక్షణ శిబిరంలో నేర్చుకున్న వాలీబాల్ క్రీడా మెలకువలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. మండల, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి టోర్నమెంట్లలో ప్రతిభ కనబరిచి జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలి. ప్రతిరోజూ వాలీబాల్ సాధన చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు" అని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని అద్భుతంగా నిర్వహించి, విద్యార్థులకు చక్కని శిక్షణ ఇచ్చిన సహాయక కోచ్లు డొంకని శివ, అవుల నవీన్లను పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ముగింపు కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎన్. లింగయ్య, ఏ. దేవదాసు, డి. వాచెస్ పతాచారి, బి. మల్లేష్, ఏ. సాంబయ్యలతో పాటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు (పి.డి) కొండ పరమేష్ గారు పాల్గొని ప్రతిభ చాటిన క్రీడాకారులందరికీ తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.