ఇది తుపానుకు ముందు నిశ్శబ్దం.. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంత పరిస్థితులను “తుపానుకు ముందు నిశ్శబ్దం”గా పేర్కొన్నారు. తన సామాజిక మాధ్యమ వేదిక truthsocial లో కృత్రిమ మేధతో రూపొందించిన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ చిత్రంలో సముద్రంలో యుద్ధ నౌకలు, అమెరికా నౌకాదళ అధికారి, ట్రంప్ కనిపించగా.. నేపథ్యంలో ఇరాన్ నౌకలను చూపించారు.
ఇరాన్పై దాడులకు అవకాశం ఉండేలా అమెరికా రక్షణ విభాగం ఏర్పాట్లు చేస్తోందన్న వార్తల మధ్య ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమతో శాంతి ఒప్పందం త్వరగా చేసుకోకపోతే ఇరాన్కు ఇబ్బందులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం వల్ల ఇరాన్కే ఎక్కువ మేలు జరుగుతుందని ఒక దూరదర్శన్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇక ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా నుంచి వచ్చిన సందేశాలు తమకు అందాయని చెప్పారు. చర్చలకు అమెరికా కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే అమెరికాపై అనుమానం పూర్తిగా తొలగిపోలేదని స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. అణ్వస్త్రాల అభివృద్ధి, హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం అంశాల్లో అమెరికా–ఇరాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మాధ్యమాల్లో కథనాలు వెలువడుతున్నాయి.