ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, మే 15: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు పని లేకపోవడంతోనే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఆయా పార్టీల నేతల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం నిజమేనని తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని చెప్పారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
ఇది ప్రజలపై భారం మోపేందుకు తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. క్రూడాయిల్ దిగుమతులపై భారీ వ్యయం అవుతోందని, అందువల్లే కేంద్రం ధరల సవరణకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అంతర్జాతీయంగా అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో కూడా ఇంధన ధరలు పెరిగాయని తెలిపారు.
ఇదిలా ఉండగా, పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3కు పైగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.