పదవ తరగతి టాపర్లకు లయన్స్ క్లబ్ నగదు పురస్కారాలు
ఎస్ఎస్సీ–2026 ఫలితాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించి, నగదు పురస్కారాలను అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
చిట్యాలలోని గ్రీన్ గ్రోవ్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో చిట్యాల మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన బాలగోని అక్షర్, ద్వితీయ స్థానం సాధించిన పందిరి సహస్రలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, నగదు పురస్కారాలను అందజేశారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని క్లబ్ సభ్యులు కొనియాడారు.
అనంతరం చిన్న కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన విద్యార్థిని హెచ్చు శ్రీవిద్యను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. భవిష్యత్తులోనూ ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ క్లబ్ తరఫున ఉన్నత విద్యకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్, కోశాధికారి కొల్లోజు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు పాటి మాధవ రెడ్డి, జీఎంటీ కోఆర్డినేటర్ తేరేటుపల్లి హనుమంతు, వరకాంతం భాస్కర్ రెడ్డి, కోమటిరెడ్డి నర్సింహా రెడ్డి, గంజి వెంకటేశం, జెల్ల రమేష్, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, రవీంద్రచారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.