ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా
ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో సోమవారం తిరువూరులోని చీరాల సెంటర్లో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు.
ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవన వ్యయం అమాంతం పెరిగిపోయిందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తూము కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు.
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పిల్లల విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించడం కూడా భారంగా మారిందన్నారు.
సీపీఐ తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్ మాట్లాడుతూ.. ఇంధన ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతోందన్నారు. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుభాని మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు, రవాణా రంగానికి ప్రత్యేక సబ్సిడీలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యాకూబ్, గురుబ్రహ్మం, ప్రసాద్, ముత్తయ్య, నరసింహారావు, పాలకుర్తి సునీల్, ఎస్కే హాసన్, ఆటో కార్మికులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.