ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం
కాన్వాయ్ తగ్గించి టూ వీలర్పై పర్యటన.. ప్రజల్లో ప్రశంసలు
చింతలపూడి దేశవ్యాప్తంగా ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛందంగా తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించడంతో పాటు, ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంచేందుకు సాధారణ టూ వీలర్పై పర్యటించి ప్రత్యేకంగా నిలిచారు.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్న వేళ, అదే దిశగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ముందడుగు వేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి చింతలపూడి మినీ బస్టాండ్ వరకు బైక్పై ప్రయాణించి ప్రజలకు సందేశం ఇచ్చారు.
“నాయకుడు అంటే చెప్పడం కాదు.. చేసి చూపించాలి” అన్న విధంగా ఎమ్మెల్యే వ్యవహరించారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంధన పొదుపు ఎంత అవసరమో తన చర్యల ద్వారా చాటిచెప్పిన ఎమ్మెల్యే నిర్ణయంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండే ఎమ్మెల్యే, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం అభినందనీయమని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం నియోజకవర్గ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే వాహనాలను వినియోగించి ఇంధనాన్ని ఆదా చేయాలని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు.