జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్లో పోస్టర్ల ఆవిష్కరణ
మంచిర్యాల
- జాతీయ డెంగ్యూ దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
- ప్రతి వారం 'డ్రై డే' పాటించాలని పిలుపు
మే 16న 'జాతీయ డెంగ్యూ దినోత్సవం' పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యాధి నివారణ అవగాహన పోస్టర్లు మరియు కరపత్రాలను జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ఇళ్లలో, పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని నొక్కి చెప్పారు. ప్రతి వారం ఒక రోజు 'డ్రై డే' పాటించి, పనికిరాని వస్తువులలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా జిల్లా ఆసుపత్రిని సంప్రదించాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
దోమల నియంత్రణకు మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మురికి కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖా అధికారిణి డాక్టర్ ఎస్. అనిత, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రవి కిరణ్ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు