జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం..
బీజేపీ నేత కోటప్రోలు కృష్ణకు ఎస్సీ మోర్చా అభినందనలు
ముదినేపల్లిలో నిర్మాణంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం అందించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణను ఏలూరు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి ప్రత్యేకంగా అభినందించారు. భవన నిర్మాణానికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ముదినేపల్లిలో జై భీమ్ భవన నిర్మాణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో, దళిత సంఘాల సహకారంతో ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది. “చదివే నేను మీకు ఆస్తి.. పుస్తకాల ముందు తలలు వంచండి” అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు కోటప్రోలు కృష్ణ తెలిపారు.
ఈ భవనం పేద దళిత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారాలని, యువత ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ ఆశయాలతో సమాజంలో విద్యా చైతన్యం పెరగాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు సేవా బాబురావు, పెద్దిరాజు కొప్పుల నాగరాజుకు విరాళం అందజేస్తూ భవన నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కోటప్రోలు కృష్ణ హామీ ఇచ్చారు.
అలాగే ఇటీవల బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత హక్కుల డప్పుల సభకు హాజరైన ఎస్సీ సోదరులందరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.