జింకలపాలెంలో ఘనంగా ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
చిన్నారులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు, మిఠాయిల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ పంచాయతీ శివారు జింకలపాలెంలోని ఉర్దూ, తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు నోట్ పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు యునెస్కో ఆధ్వర్యంలో 1967 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘అక్షరం లేని జీవితం చీకటితో సమానం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం నేర్పించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశ అక్షరాస్యత 18 శాతంగా ఉండేదని, ప్రస్తుతం దేశంలో సుమారు 80 శాతం మంది అక్షరాసులుగా ఉన్నారని తెలిపారు. అక్షరాస్యత పెరిగిన కొద్దీ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్య ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు నాగళ్ళ మురళి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ షహనాజ్ బేగం, ఉపాధ్యాయులు నాగారపు బద్రినాథ్, కే. నరేష్ బాబు, సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, ఎస్.కె. నాగుల్ మీరా, వూటుకూరు యజ్ఞ కృష్ణ, పంది సురేష్, పంది నరసింహారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలోనూ అక్షరాస్యతా దినోత్సవం
జింకలపాలెం అంగన్వాడీ కేంద్రంలోనూ ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా సేవా కమిటీ సభ్యులు అంగన్వాడీ చిన్నారులకు పలకలు, మిఠాయిలు పంపిణీ చేశారు. విద్య ప్రాధాన్యత, అక్షరాస్యతా దినోత్సవం విశిష్టతను అంగన్వాడీ ఉపాధ్యాయురాలు షేక్ మీరాబీ చిన్నారులకు వివరించారు. కార్యక్రమంలో సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అంగన్వాడీ చిన్నారులు పాల్గొన్నారు.