జియాగూడలో అక్రమ సమోసా కేంద్రంపై దాడి
జియాగూడలో అక్రమ సమోసా కేంద్రంపై దాడి రు.5 లక్షల అపరిశుభ్ర ఆహార పదార్థాలు స్వాధీనం – వృద్ధుడు అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని జియాగూడలో అక్రమంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రంపై ప్రత్యేక బృందం శుక్రవారం మెరుపు దాడి నిర్వహించింది. ఈ దాడిలో సుమారు రు.5 లక్షల విలువైన అపరిశుభ్ర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, కేంద్రాన్ని సీజ్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ (73)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి 20 సాయంత్రం ప్రత్యేక బృందం, కుల్సుంపురా పోలీసులు, ఆహార భద్రత అధికారులతో కలిసి జియాగూడలోని ఒక నివాస గృహంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే సమోసా తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు.
తనిఖీల్లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, పదేపదే వాడిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్టు బయటపడింది. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన గుడ్డు, మక్కజొన్న, ఉల్లిపాయ సమోసాలు పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు.
ఈ దాడిలో పాడైన గుడ్లు 500, వాడేసిన నూనె 5 కిలోలు, గుడ్డు సమోసాలు 350, మక్కజొన్న సమోసాలు 600, ఉల్లిపాయ సమోసాలు 1000, మైదా 50 కిలోలు, ఉప్పు బస్తాలు, సమోసా పట్టీలు, అపరిశుభ్రమైన మక్కజొన్నతో పాటు వంట యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.