కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం
జిల్లా కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలి: శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఉమ్మడి ఆదిలాబాద్ మరియు మంచిర్యాల జిల్లాల మండల, పట్టణ కమిటీలలో పద్మశాలి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పద్మశాలీలు తీవ్రంగా కృషి చేశారని, అయినా పదవుల పెంపకంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 1978 నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చివరి శ్వాస వరకు శ్రమించిన తాటిపాముల నాగయ్య, పసుపునూరి రంగయ్య, జంజీరాల రాజం, మీసాల నర్సయ్య వంటి పద్మశాలి నాయకుల సేవలను రాష్ట్ర, జిల్లా నాయకత్వం విస్మరించడం బాధాకరమని సభ అభిప్రాయపడింది.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి జిల్లా, మండల, మున్సిపల్ కమిటీల్లో పద్మశాలీయులకు సముచిత స్థానం కల్పించాలని, లేనిపక్షంలో రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని నాయకులు హెచ్చరించారు. "రాజ్యాధికారంలో వాటా - సామాజిక న్యాయం" కోసం పద్మశాలీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్యతో పాటు పద్మశాలి సంఘం నాయకులు వేముల అశోక్, చిప్ప రామస్వామి, జంజీరాల నారాయణ, అడిచర్ల రాజేశం, పరిసె శ్రీనివాస్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు