కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం.. రంజాన్ తోఫాపై మాజీ జడ్పీ చైర్పర్సన్
కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం.. రంజాన్ తోఫాపై మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఫైర్!
జగిత్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనార్టీ వర్గాలను విస్మరిస్తోందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేయకపోవడంపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు గౌరవం..
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు అన్ని మతాల పండుగలకు సమాన గౌరవం ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. "హిందూ మహిళలకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందించి పండుగ పూట పేదల ముఖాల్లో చిరునవ్వు నింపిన ఘనత కేసీఆర్ గారిదే" అని కొనియాడారు.
కుట్రపూరితంగా తోఫాల తగ్గింపు!
జగిత్యాల నియోజకవర్గంలో గతంలో 4,000 రంజాన్ తోఫాలు పంపిణీ చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1,200 తోఫాలతో సరిపెట్టే కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. రంజాన్ మాసం ముగుస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే గారు ముస్లిం సోదరులకు తోఫాలు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. కేవలం మొక్కుబడిగా కొన్ని బహుమతులు ఇచ్చి మైనార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
హామీలు ఏమయ్యాయి?
అధికారంలోకి వస్తే పేద ముస్లింలందరికీ తోఫా అందిస్తామన్న హామీని కాంగ్రెస్ గాలికి వదిలేసిందని వసంత సురేష్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీ సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు:
కళ్యాణలక్ష్మి: ముస్లిం ఆడబిడ్డల పెళ్లికి రూ. 1,16,116 అందించడం.
గౌరవ వేతనాలు: ఇమామ్లు, మౌజన్లకు దేశంలోనే తొలిసారిగా జీతాలు అందించిన ఘనత కేసీఆర్ది.
గురుకులాలు: రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి, ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తూ ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులైన ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా అందించాలని, లేనిపక్షంలో మైనార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత తప్పదని ఆమె హెచ్చరించారు.