కేంద్ర క్యాబినెట్లో భారీ మార్పులు..? నితీశ్కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు!
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు జరిగే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిహార్ మాజీ సీఎం, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన నితీష్ కుమార్ కు కేంద్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న మరో ఇద్దరు నేతలను పదవులకు రాజీనామా చేయించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకురావచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒకేసారి రెండు, మూడు శాఖలను నిర్వహిస్తున్న కొందరు కేంద్ర మంత్రుల బాధ్యతలను పునర్వ్యవస్థీకరించి కొత్తవారికి కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైల్వే, ఐటీ, పౌర విమానయాన శాఖల్లో మార్పులు ఉండొచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలుగానే ఉన్నాయని, అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.