లోక్సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై బిల్లుకు సిద్ధత
కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు లోక్సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై బిల్లుకు సిద్ధత
న్యూఢిల్లీ, మార్చి 24: దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసేలా కేంద్ర ప్రభుత్వం లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను సుమారు 50 శాతం పెంచే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.
ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ స్థానాలను 816కు పెంచే ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కు పెరిగే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కు, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 263కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. 2029 సాధారణ ఎన్నికల నుంచి అమలు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన NDA సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం ఈ ప్రతిపాదనపై ప్రాథమిక వివరాలు వెల్లడించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, ఈ నిర్ణయం అమలులోకి రావాలంటే పార్లమెంట్ ఆమోదం అవసరం ఉండటంతో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.