క్లాట్–2027 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
క్లాట్–2027 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
న్యాయ విద్యలో ప్రవేశం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు కీలక ప్రకటన వెలువడింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)–2027కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 3 నుంచి ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 31, 2026 వరకు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.
క్లాట్–2027 పరీక్షను డిసెంబర్ 6, 2026న దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు సహా క్లాట్ స్కోరును పరిగణనలోకి తీసుకునే పలు న్యాయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి.
దరఖాస్తు రుసుమును సాధారణ వర్గ అభ్యర్థులకు రూ.4,000గా, ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.3,500గా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు అర్హతలు, అవసరమైన పత్రాలు, ఇతర నిబంధనలను పరిశీలించి పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించాలని సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిదని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.