చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం కళ్లముందే కన్నతల్లి..
పని ముగించుకొని ఇంటి బాట పట్టిన ఓ తల్లి.. కుమారుల కళ్లముందే రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చౌటుప్పల్ మండలం
దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన ఏనుగు అనసూయ (56) తన ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్రవాహనంపై చౌటుప్పల్కు వచ్చింది. పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వెళ్తుండగా స్థానిక టీడీపీ కార్యాలయం సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనసూయ రోడ్డుపై పడిపోగా, డీసీఎం వాహనం ఆమె తలపై నుంచి వెళ్లింది. దీంతో మెదడు చిట్లిపోయి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఇద్దరు కుమారులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. కళ్లముందే తమ కన్నతల్లి రక్తపు మడుగులో పడిపోయి విగతజీవిగా మారడంతో కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.