కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్లో శిశువు విక్రయం కలకలం
కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్లో శిశువు విక్రయం కలకలం
పేదరికం, పోషించే స్తోమత లేక ఓ దంపతులు తమ నవజాత ఆడశిశువును రూ.3 లక్షలకు అమ్మేసిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్, శిరీష దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో మెదక్ మాతా శిశు కేంద్రంలో శిరీష మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో శిశువును పోషించలేమని భావించిన దంపతులు బిడ్డను విక్రయించాలని నిర్ణయించారు.
మధ్యవర్తుల సహాయంతో సిద్ధిపేట జిల్లా అల్లీనగర్కు చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులకు రూ.3 లక్షలకు శిశువును అప్పగించారు.
అయితే ప్రసవం తర్వాత తల్లి వద్ద బిడ్డ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడీ సిబ్బంది ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. తాండాలో విచారణ చేపట్టిన అధికారులు శిశు విక్రయం జరిగినట్టు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శిశువు తల్లి, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో పాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.
డబ్బు కోసం పసిబిడ్డల భవిష్యత్తును అమ్మేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.