కొడాలి నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట.. కేసుపై స్టే
మాజీ మంత్రి, కొడాలి నానిపై గుడివాడలో నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొడాలి నానిపై ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్కు హైకోర్టు స్టే విధించింది. అలాగే ఆయనపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది.
2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2021 ఫిబ్రవరి 16న గుడివాడలో ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో తాజాగా విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కొడాలి నానిపై ప్రభుత్వం ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతిని తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.