కొణిజర్లలో రైతులకు కొత్త పట్టాదారు పాస్పుస్తకాలపై అవగాహన కల్పించిన ఆర్డీఓ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామ సచివాలయాన్ని ఆర్డీఓ ఏ. కుమార్ శనివారం సందర్శించారు. రీసర్వే పూర్తైన నేపథ్యంలో కొత్త పట్టాదారు పాస్పుస్తకాల మంజూరు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు విడుదల చేసిన డ్రాఫ్ట్ పట్టాదారు పాస్పుస్తకాలను రైతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. వాటిలో పేరు, తండ్రి పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, చిరునామా, భూ విస్తీర్ణం తదితర వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేసుకోవాలని తెలిపారు. అనంతరం ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు.
అనంతరం రైతులతో సమావేశమై ప్రస్తుత ఖరీఫ్ సాగు పరిస్థితులపై ఆరా తీశారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గంపలగూడెం తహసీల్దార్, రెవెన్యూ శాఖ వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.