కూల్చివేతలు కాంగ్రెస్ పాలనలోనే... BRSపై నిందలు రాజకీయ కక్షసాధింపే: మధిర BRS
కూల్చివేతలు కాంగ్రెస్ పాలనలోనే... BRSపై నిందలు రాజకీయ కక్షసాధింపే: మధిర BRS
మధిర, ఆగస్టు 6: మధిరలో జరుగుతున్న కూల్చివేతల అంశంలో కాంగ్రెస్ నాయకులు BRSపై చేస్తున్న విమర్శలు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని BRS నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి ప్రతి అంశంలో BRSనే లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
కూల్చివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను పరామర్శించేందుకు TDP, CPM నాయకులు కూడా ఘటనాస్థలికి వెళ్లి సంఘీభావం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే వాటిని పూర్తిగా విస్మరించి BRSను మాత్రమే విమర్శించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనూ, మధిర మున్సిపాలిటీలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రజల ఇళ్లు, దుకాణాల కూల్చివేతలు కూడా వారి పాలనలోనే జరుగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ బాధ్యతను స్వీకరించకుండా BRSపై ఆరోపణలు చేయడం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని విమర్శించారు.
ప్రతి అంశంలో BRSనే లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే కాంగ్రెస్కు అసలైన రాజకీయ ప్రత్యామ్నాయం BRS పార్టీయేనని వారే అంగీకరిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
అండర్గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రజల ముందుంచాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరు, మొత్తం వ్యయం ఎంత, ప్రాజెక్టు మ్యాప్ ఎక్కడ ఉంది, ఏయే ప్రాంతాల్లో పనులు చేపడతారు, సంబంధిత అధికారులు పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.
ఎలాంటి ప్రణాళిక లేకుండా రోడ్లు తవ్వడం వల్ల వ్యాపారులు, విద్యార్థులు, వృద్ధులు, అత్యవసర సేవలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.
BRS అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి పేరుతో ప్రజలకు అన్యాయం జరగకూడదని, ముందుగా చట్టబద్ధంగా నోటీసులు జారీ చేసి, బాధితుల అభ్యంతరాలు విని, తగిన పరిష్కారం చూపిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మధిర కాంగ్రెస్ నాయకులు బెల్ట్ షాపులు, మట్టి దోపిడీ వంటి అంశాలపైనే శ్రద్ధ చూపుతూ ప్రజల అసలు సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలు మానుకుని అధికార పార్టీగా ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బిక్కి కృష్ణ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, 19వ వార్డు కౌన్సిలర్ వై.వి. అప్పారావు, వంగవీడు మాజీ సర్పంచ్ వీరారెడ్డి, బొగ్గుల భాస్కర్ రెడ్డి, కటికల సత్యనారాయణ రెడ్డి, ఆళ్ల నాగబాబు, సైదా, చిదిరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.