కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: పార్లమెంట్లో గళమెత్తిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
వెల్గటూర్:
శాతవాహనుల తొలి రాజధాని, ప్రముఖ శైవ క్షేత్రమైన కోటిలింగాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన కోటిలింగాల అభివృద్ధిపై గళమెత్తారు.
వారసత్వ సంపదను వెలికితీయాలి:
శాతవాహన సామ్రాజ్యానికి పురిటిగడ్డ అయిన కోటిలింగాల భూగర్భంలో ఎంతో చారిత్రక సంపద నిక్షిప్తమై ఉందని ఎంపీ పేర్కొన్నారు. పురావస్తు శాఖ ద్వారా ఇక్కడ మరిన్ని తవ్వకాలు జరిపి, ఆ వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రామగిరి ఖిల్లాతో పాటు కోటిలింగాలను పర్యాటక సర్క్యూట్లో చేర్చి, ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి:
కోటిలింగాల అంటే తెలుగు వారి గుండె చప్పుడు అని అభివర్ణించిన వంశీకృష్ణ, ఈ ప్రాంతానికి క్రీస్తు పూర్వం 200 ఏళ్ల ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన ప్రణాళికలతో అభివృద్ధి చేస్తే, ధర్మపురి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన సూచించారు. భావితరాలకు మన చరిత్రను తెలియజేసేలా కోటిలింగాలను తీర్చిదిద్దాలని ఎంపీ కేంద్రానికి విన్నవించారు.