కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’...
కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’... రాజకీయాల్లో కొత్త చర్చకు దారి
హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ నమోదు కోసం ఈ ఏడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘం కు దరఖాస్తు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం దాఖలు చేసిన ఈ దరఖాస్తుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించడం గమనార్హం. తన పిటిషన్ను వేగంగా పరిశీలించాలని, ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.
ఈ కేసు ఇవాళ విచారణకు రానుండగా, కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశముందన్న చర్చ జోరందుకుంది.