మధిరలో టైలర్ హత్య కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్
మధిరలో టైలర్ హత్య కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్
కర్రతో కొట్టి హత్య చేసిన నిందితుల అరెస్ట్.. సాక్ష్యాలు దాచిన మరో ఇద్దరిపై కేసు నమోదు
మధిర, ఆగస్టు 29: ఖమ్మం జిల్లా మధిర పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆత్కూరు రోడ్డులోని పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న కాసర్ల వెంకటేశ్వరరావు బ్రిక్స్ కంపెనీకి వెళ్లే దారిలో ఈ నెల 11న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటనపై క్రైమ్ నెంబర్ 144/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్ 103(1) ప్రకారం కేసు నమోదు చేశారు.
హత్యకు గురైన వ్యక్తిని ఖమ్మం గట్టయ్య సెంటర్కు చెందిన ఎండీ తాలీమ్ (45)గా పోలీసులు గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా టైలర్గా పనిచేస్తున్నాడు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ జిల్లా సదాతూర్ పైగంబర్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితులైన గద్దల జమలయ్య అలియాస్ ఏపోబు (33), ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెద్ద కొమెర గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, గుంజి రాములమ్మ (40), ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపవరం గ్రామానికి చెందిన కూలీని పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు దారితీసిన ఘటన..
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఇద్దరూ కాసర్ల వెంకటేశ్వరరావు బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆగస్టు 10న రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో బ్రిక్స్ కంపెనీ వద్ద ఉన్న సమయంలో తాలీమ్ అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో రాములమ్మతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహానికి గురైన జమలయ్య అతడిని చంపాలనే ఉద్దేశంతో కర్రతో పలుమార్లు కొట్టాడు. దీంతో తాలీమ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం రాములమ్మ మృతుడి సెల్ఫోన్ను తీసుకోగా, ఇద్దరూ కలిసి హత్యకు ఉపయోగించిన కర్ర, సెల్ఫోన్ను జలుగుమాడు ప్రాంతంలోని గదిలో దాచిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
సాక్ష్యాలు దాచిన వారిపై కేసు..
హత్య విషయం బ్రిక్స్ కంపెనీ యజమాని కాసర్ల వెంకటేశ్వరరావుకు, అతని పెద్దల్లుడు పేరయ్యకు నిందితులు చెప్పినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లు దర్యాప్తులో తేలింది.
అంతేకాకుండా హత్యకు ఉపయోగించిన కర్రను దాచిపెట్టాలని, జమలయ్య ఫోన్ కాల్ లిస్ట్లోని కొన్ని వివరాలను తొలగించి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కాసర్ల వెంకటేశ్వరరావు, పేరయ్యలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
పోలీసులు నిందితుల నుంచి
హత్యకు ఉపయోగించిన కర్ర
మృతుడి సెల్ఫోన్
రక్తపు మరకలు ఉన్న నిందితుడి దుస్తులు
నిందితుడి సెల్ఫోన్
స్వాధీనం చేసుకున్నారు.
కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వైయరా ఏసీపీ తెలిపారు.