మెట్టగుట్ట దేవస్థానానికి రూ.25,116 విరాళం
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: గంపలగూడెం మండలం పెనుగొలను సమీపంలోని మెట్టగుట్టలో వెలసిన శ్రీ గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాసస్వామి దేవస్థానానికి తునికిపాడు గ్రామానికి చెందిన కర్నాటి కృష్ణారావు, స్వరూపారాణి దంపతులు శనివారం రూ.25,116 విరాళాన్ని అందజేశారు.
దాతల నుంచి ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు విరాళాన్ని స్వీకరించారు. అనంతరం దాత దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్యామ్ కె. సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు.
శనివారం పర్వదినం సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దేవస్థానంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు విరాళాలు అందించి సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.