మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కువకాలం కేంద్రాల వద్ద నిల్వ ఉంచకుండా వెంటనే మిల్లులకు తరలించాలి అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.శుక్రవారం రోజున పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలోని విజయదుర్గ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్లులో ధాన్యం నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియ,మిల్లింగ్ కార్యకలాపాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రస్తుతం రైస్ మిల్లులో ఎంత సామర్థ్యం మేర ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి ఉందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వస్తున్న ధాన్యం నిల్వకు తగిన స్థలం ఉందా అని మిల్లులో ధాన్యం అన్లోడ్ చేసే ప్రదేశాన్ని,వచ్చిన ధాన్యాన్ని సక్రమంగా నిల్వ ఉంచేందుకు సరిపడా స్థలం ఉందా లేదా అని స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. రోజుకు ఎన్ని లారీలు ధాన్యం లోడ్తో మిల్లుకు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.లారీలు వచ్చిన వెంటనే అన్లోడ్ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం నిల్వలు ఎక్కువ కాలం బయట ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.వర్షాకాలం దృష్ట్యా ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల నుండి వచ్చిన ధాన్యం నాణ్యత కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మిల్లు యాజమాన్యానికి ఆదేశించారు.అనంతరం ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం శుభ్రపరిచే విధానం, డ్రైయింగ్, మిల్లింగ్, పాలిషింగ్ వంటి దశలను పరిశీలిస్తూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రభుత్వానికి సరఫరా చేసే బియ్యం నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ధాన్యం అన్లోడింగ్ నుంచి బియ్యం తయారీ వరకు ప్రతి దశలో వేగం, పారదర్శకత, నాణ్యత ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.