మంచిర్యాల - హైదరాబాద్కు జాతీయ రహదారి నిర్మించాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రఘునాథ్ వెరబెల్లి వినతి
రాజీవ్ రహదారి సమస్యల పరిష్కారానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి
హైదరాబాద్: మంచిర్యాల - హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారి వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను పరిష్కరించడానికి నూతనంగా జాతీయ రహదారిని నిర్మించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి శనివారం హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన నాగ్పూర్ - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేను చంద్రపూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట మీదుగా హైదరాబాద్ వరకు నిర్మించేలా ఉన్న అవకాశాలను పరిశీలించాలని, దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడాలని కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల మీదుగా నూతన జాతీయ రహదారిని నిర్మిస్తే రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, వాహనదారుల ప్రయాణం సురక్షితంగా మరియు సులభతరంగా మారుతుందని రఘునాథ్ వెరబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు