మూడు నెలల్లో సంక్షేమ వసతి గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలి
మూడు నెలల్లో సంక్షేమ వసతి గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మార్చి 14
రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న సంక్షేమ వసతి గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా 80 శాతం పనులు పూర్తయిన భవనాలను రాబోయే మూడు నెలల్లోనే పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సమీక్షా సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు శాఖాపరమైన సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షలోని ముఖ్యాంశాలు:
నిర్మాణాల వేగవంతం: 80 శాతం పనులు పూర్తయిన హాస్టల్ భవనాలను మూడు నెలల్లో పూర్తి చేయాలి. వేసవి సెలవుల్లోనే మరమ్మతు పనులు పూర్తి చేసి విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధం చేయాలి.
బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక అధికారి: వసతి గృహాల మరమ్మతు బిల్లులను ప్రతి 15 రోజులకు ఒకసారి క్లియర్ చేసేలా ఆర్థిక శాఖకు పంపేందుకు ఒక ప్రత్యేక సీనియర్ అధికారిని నియమించాలని సూచించారు.
సకాలంలో వేతనాలు, చార్జీలు: అద్దెలు, విద్యుత్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు, మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని ఆదేశించారు. గతంలో ఏడు నెలలకోసారి ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు.
నాణ్యతపై పర్యవేక్షణ: వసతి గృహాలకు సరఫరా చేసే వస్తువుల నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. డైట్ చార్జీలను 40%, కాస్మోటిక్ చార్జీలను 200% పెంచిన నేపథ్యంలో, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందాలని పేర్కొన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ
సంక్షేమ శాఖలోని పెండింగ్ సమస్యలను బడ్జెట్కు అనుసంధానం చేస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సమగ్ర వివరణ ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలలు, కార్పొరేషన్లు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు మరియు సీనియర్ సిటిజన్ల పథకాల అమలులో ఎదురవుతున్న ఆటంకాలను ఆయన ప్రస్తావించారు. మంత్రి చూపిన చొరవ పట్ల డిప్యూటీ సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రాధాన్య క్రమంలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు సభ్య సాచి గోష్, కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.