మూడు రోజులు భారీ వర్షాలకు అవకాశం.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాకపోవడంతో పలు ప్రాంతాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ సాధారణ స్థాయిలో వర్షాలు కురవకపోయినప్పటికీ.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ వైపు పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.
పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.