మాగుంట వ్యాఖ్యలు ఉపసంహరించుకుని జగన్కు క్షమాపణ చెప్పాలి
మర్యాద లేని మాటలు సరికాదు.. అన్నా రాంబాబు ఆగ్రహం
ప్రకాశం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. జగన్కు, వైఎస్సార్సీపీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.
మార్కాపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరుతో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మెప్పు కోసం మాగుంట శ్రీనివాసులురెడ్డి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాజకీయాల్లో కనీస మర్యాద, సంస్కారం పాటించాలని హితవు పలికారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకరించి మాగుంటకు అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. చేసిన మేలును మరిచి ప్రస్తుతం చంద్రబాబు పంచన చేరి విమర్శలు చేయడం సరికాదన్నారు.
ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి ఆనందం లేదని చెబుతున్న మాగుంట 2009లో ఎంపీగా, 2014లో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాకు ఏం చేశారని అన్నా రాంబాబు ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశంతోనే మాగుంట ఎంపీగా గెలిచారని, జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఏమీ చేయలేదని భావిస్తే అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
"మన కులపోడని ఓటేస్తే" అంటూ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, ఆ ఓట్ల కోసమే అప్పట్లో మాగుంట ప్రయత్నించారని విమర్శించారు.
ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఆదరించారని, అయితే ఆ కుటుంబం జిల్లాకు చేసిన సేవలు ఏమిటో చెప్పాలని అన్నా రాంబాబు ప్రశ్నించారు. తాను ఇదే ప్రశ్న అడిగినప్పుడు తనపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ప్రశ్న అడుగుతున్నానని అన్నారు.
మాగుంట చేసిన మర్యాద లేని వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీకి క్షమాపణ చెప్పాలని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.