గుడిపాడులో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు...
గుడిపాడులో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు.. దోమల బెడదతో అనారోగ్యం పాలవుతున్న కుటుంబం
నూజివీడు / గుడిపాడు, సెప్టెంబర్ 02
ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలోని మసీదు రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, ఇతర కీటకాలు పెరిగి వ్యాధుల ముప్పు ఏర్పడుతోందని నూరు బాషా షకూర్ బి ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన కాలువల వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలో ఉపయోగించిన నీరు, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోతున్నాయని తెలిపారు. నిలిచిపోయిన మురుగునీటిలో దోమలు, కీటకాలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
తమ కుటుంబ సభ్యులందరికీ దోమల బెడదతో జ్వరాలు వస్తున్నాయని, శుభ్రమైన వాతావరణం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని షకూర్ బి తెలిపారు. సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది.