నేపాల్లో భారీ విషాదం.. వరదల్లో మృతుల సంఖ్య 1000 దాటింది.. వేలాది మంది గల్లంతు
నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 1000 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి 1,003 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ అధికారులు తెలిపారు.
వరదల ప్రభావంతో దాదాపు 4 వేల మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఎనిమిది జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 వేల మందికిపైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది.
నేపాల్–టిబెట్ సరిహద్దులో భోటేకోశీ నది ఉప్పొంగడంతో ఆగస్టు 26న భారీ వరదలు సంభవించాయి. ఉత్తర, మధ్య నేపాల్లోని పలు పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు ఇళ్లు, వాహనాలు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి.
చిత్వానా జిల్లాలో అత్యధికంగా 321 మృతదేహాలను వెలికితీశారు. నవాల్ పరాసీ జిల్లాలో 216, నవాల్ పరాసీ వెస్ట్లో 170, నువాకోట్లో 95, ఘోర్కాలో 65, ధాడింగ్లో 57, రసువాలో 41, తనాహున్లో 38 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 11,814 మందిని రక్షించగా, వారిలో తమిళనాడుకు చెందిన 39 మంది మానససరోవర యాత్రికులు కూడా ఉన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 158 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది సభ్యులు కూడా వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిలో హైదరాబాద్కు చెందిన శ్రీదేవి వేజెళ్ల ఉన్నారని తెలిసి ఆమె భర్త, అమెరికా పౌరుడు దీపక్ దండు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరదల తర్వాత ఆమెతో సంబంధాలు తెగిపోవడంతో ఆమె ఆచూకీ కోసం భారత్కు బయలుదేరారు.
ఇదిలా ఉండగా, రుసువా జిల్లాలో వరదల్లో మృతి చెందిన విదేశీ పౌరుల మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించే ప్రక్రియను నేపాల్ అధికారులు ప్రారంభించారు. మృతుల వివరాలు, ఫొటోలను పోలీస్ వెబ్సైట్లో ఉంచినట్లు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. గుర్తింపు అనంతరం స్థానిక అధికారులతో సమన్వయం చేసి మృతదేహాల అప్పగింత ప్రక్రియలో సహాయం అందిస్తామని వెల్లడించింది.