మురుగులో మగ్గుతున్న చింతలపాడు.. అధికారుల నిర్లక్ష్యానికి గ్రామస్తుల ఆవేదన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడు గ్రామం రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ అధికారుల అలసత్వానికి బలైపోతోంది. చుట్టుపక్కల పది గ్రామాలకు కూడలిగా ఉన్న చింతలపాడు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రధాన గ్రామం. అయితే గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైకి చేరి నడిబొడ్డునే నిల్వ ఉండిపోతోంది. దీంతో గ్రామమంతా దుర్గంధభరితంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత విచిత్రం ఏమిటంటే గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ప్రతిరోజూ ఇదే మురుగు నీటిని దాటి విధులకు హాజరవుతున్నప్పటికీ సమస్యపై స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
దైవ దర్శనాలకు వెళ్లేందుకు బస్సుల కోసం వచ్చే భక్తులు, శుభకార్యాలకు వెళ్లే మహిళలు, వృద్ధులు ఈ మురుగు నీటిలోనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన మురుగు నీటితో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ఇది చింతలపాడా.. లేక మురుగుగుంటలపాడా?” అంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగు సమస్య నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.