నాగిరెడ్డిగూడెం గురుకులంలో నీటి సమస్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో నెలకొన్న తీవ్రమైన నీటి సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం పాఠశాల ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా పాఠశాలలో తాగునీరు, రోజువారీ అవసరాలకు సరిపడా నీటి సరఫరా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత కారణంగా స్నానాలు చేయడం, మరుగుదొడ్లు వినియోగించడం కూడా కష్టంగా మారిందని విద్యార్థులు వాపోయారు.
నీటి సరఫరా నిలిచిపోవడంతో కిచెన్, హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని, దీంతో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతోనే నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.
"విద్యార్థులకు న్యాయం చేయాలి... వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి" అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.