రెసిడెన్షియల్ పాఠశాల నీటి సమస్యపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ సీరియస్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
యుద్ధ ప్రాతిపదికపై చర్యలకు ఆదేశాలు.. నీటి సరఫరాకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ వెంటనే స్పందించారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం అందుకున్న వెంటనే అధికారులతో మాట్లాడి పరిస్థితిపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సమస్య ఎందుకు తలెత్తిందని అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యేకు, కొంతమంది ఆకతాయిలు నీటి సరఫరా గేటు వాల్వ్లను ఇష్టానుసారంగా తిప్పి పాఠశాలకు వెళ్లాల్సిన నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని అధికారులు వివరించారు. దీంతో నిర్ణీత సమయానికి పాఠశాలకు నీరు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించారు. వెంటనే పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల అవసరాలకు ఆటంకం కలిగించే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.
అలాగే మున్సిపల్ అధికారులకు పాఠశాలలో నీటి సరఫరా అంతరాయం లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.