నేతన్నల హామీలు అమలు చేయాలి: పద్మశాలి సంఘం డిమాండ్
నేతన్నల హామీలు అమలు చేయాలి: పద్మశాలి సంఘం డిమాండ్
మంచిర్యాల, ఏప్రిల్ 09 (ప్రజా ప్రతినిధి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని, 2023 ఎన్నికల సమయంలో నేతన్నలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ డిమాండ్ చేసింది. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సంస్థ సమావేశంలో నాయకులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘాల నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ప్రతినిధి మరియు సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత చేనేతలపై ఉప్పుపాదం మోపుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 105.54 కోట్ల పాఠశాల యూనిఫామ్స్ ఆర్డర్ను రద్దు చేయడం చేనేత కార్మికుల పొట్ట కొట్టడమేనని, ఇది మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల నుండి రావాల్సిన రూ. 200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల ఆర్డర్లు రాకపోవడం వల్ల టెస్కో మరియు కార్మికులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ, టైగర్ అలె నరేంద్ర, సిరిపురపు యాదయ్య వంటి నేతల త్యాగాలను ప్రభుత్వం మరువకూడదని, ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందులతో 36 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని వారు గుర్తు చేశారు. రద్దు చేసిన రూ. 105.54 కోట్ల ఆర్డర్ను పునరుద్ధరించాలని, ముడి సరుకులపై సబ్సిడీ ఇవ్వాలని, పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే చేనేత నుండి జౌళి శాఖను వేరు చేయాలని, ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు రుక్మ రావు, కార్యదర్శి అడిచర్ల రాజేశం, నాయకులు రవి, శ్రీనివాస్, నారాయణ, సత్యనారాయణ, దామోదర్ తదితరులు పాల్గొని "నేత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినదించారు.