నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ
నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ మెడలోని మంగళసూత్రం, కమ్మలను లాక్కెళ్లి పరారయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను వెంటనే పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని, సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలను విశ్లేషించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఘటన స్థల పరిశీలనలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.