నిలిపి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం, యువకుడి మృతి
నిలిపి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం, యువకుడి మృతి
నల్గొండ జిల్లా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీ లింగోటం గ్రామ శివారులో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన ఊట్కూరి శ్రావణ్ కుమార్ (23), తన స్నేహితుడు శాలిగౌరారం మండలం తక్కెళ్ళపాడుకు చెందిన డ్రైవర్ భీమనపల్లి యాదగిరి (33) తో కలిసి అశోక్ లేలాండ్ వాహనంలో నార్కట్పల్లి నుండి డెకరేషన్ వస్తువులను లోడ్ చేసుకున్నారు. వీరు తిరిగి తక్కెళ్ళపాడు గ్రామానికి వెళ్తుండగా, మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఏపీ లింగోటం బ్రిడ్జిపైకి చేరుకున్నారు. ఆ సమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న టీఎస్ 36 టి 6499 నెంబర్ గల లారీ డ్రైవర్, ఎలాంటి ముందస్తు సిగ్నల్స్ ఇవ్వకుండా ఒక్కసారిగా రోడ్డుపై లారీని ఆపాడు. వెనుకనే వస్తున్న యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేయడానికి బ్రేక్ వేసినప్పటికీ, వేగంగా వెళ్లి లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ సీటులో కూర్చున్న శ్రావణ్ కుమార్ తలకు బలమైన రక్త గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి ఊట్కూరి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు..