నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు
నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు NTODAY NEWS నార్కెట్పల్లి
మైనర్పై వేధింపులకు ఏడేళ్ల కఠిన శిక్ష
* రెండు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
మైనర్ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టిన ఉన్మాదికి న్యాయస్థానం సరైన శిక్ష విధించింది. ఆరేళ్ల క్రితం నార్కట్పల్లి మండలంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడికి ఏడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.2018, ఏప్రిల్ 20న నార్కట్పల్లి మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఉప్పందల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, ఒక మైనర్ బాలికను తన ద్విచక్ర వాహనంపై బలవంతంగా తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారయత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో భయపడిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 504, 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు, సాక్ష్యాధారాలను పరిశీలించి దుర్గాప్రసాద్ను నిందితుడిగా నిర్ధారించింది. నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష మరియు 4,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత బాలిక పట్ల మానవత్వంతో స్పందించిన కోర్టు, ఆమెకు 2 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. అప్పటి ఎస్సై గోవర్ధన్, ప్రస్తుత ఎస్సై విష్ణు ఆధారాలను పక్కాగా సేకరించారు. కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ తన బలమైన వాదనలతో నిందితుడి నేరాన్ని నిరూపించారు.