నూజివీడు ఎక్సైజ్ పరిధిలో మార్పు కార్యక్రమం విజయవంతం
30 మందికి పునరావాసం – స్వయం ఉపాధి వైపు మలుపు
నూజివీడు, ఏప్రిల్ 2: నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన “మార్పు కార్యక్రమం” ఫలితంగా గతంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడిన 30 మందికి పునరావాసం కల్పించి, ఉపాధి అవకాశాలు అందజేశారు. దీంతో వారు అక్రమ కార్యకలాపాలకు దూరంగా వెళ్లి, క్రమబద్ధమైన జీవన విధానంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. విన్నుత్న పాల్గొని లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. వారి జీవన విధానం, ఉపాధి పురోగతిని సమీక్షించి, ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గతంలో సారా అమ్మకం వంటి అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారు ప్రస్తుతం స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ మార్పుతో వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కూడా పొందుతున్నారని పేర్కొన్నారు.
సబ్ కలెక్టర్ బి. విన్నుత్న మాట్లాడుతూ, “మార్పు కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తున్నాయి. లబ్ధిదారుల విజయాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిత, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.