నోస్ ల్యాబ్ బాధితులకు ప్రభుత్వం అండ
నోస్ ల్యాబ్ బాధితులకు ప్రభుత్వం అండ
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.
* భద్రతా లోపాలపై అధికారుల ఆరా
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం బొంగోనిచెర్వు సమీపంలోని నోస్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడగా, వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ను సందర్శించిన అధికారులు, సంఘటనకు గల కారణాలు, అమలులో ఉన్న భద్రతా చర్యలపై ప్లాంట్ ఇన్చార్జిని ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత, బీమా సదుపాయాలు, కంపెనీ అనుమతులపై కూడా వివరాలు సేకరించారు.
స్థానికులు ల్యాబ్ సామర్థ్యానికి మించి ఉత్పత్తి జరుగుతోందని, కొత్త భవనాలకు సరైన అనుమతులు లేవని ఆరోపించారు. పరిసర ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు సరైన భద్రత లేకపోవడంపై ఆందోళనలు వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కంపెనీ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. బాధితుల పక్షాన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.